30, జులై 2009, గురువారం

శశిరేఖ

sasirekha2

గుడిపాటి వెంకటాచలం పేరు తెలియని తెలుగు భాషాభిమాని ఉన్నాడంటే నాకు నిజంగా ఆశ్చర్యమే. చలంపై మీకెటువంటి అభిప్రాయమైనా ఉండవచ్చు. కానీ అతను ఒక ప్రవాహానికి పాదులు తీశాడు. తెలుగు భాషను శాసించాడు. సంఘాన్ని ధిక్కరించాడు. అవసరమైనప్పుడల్లా తన నాయికల గొంతుతో ప్రశ్నించాడు. చలంకు "శశిరేఖ" మొదటి నవలే అయినా అప్పటి సంఘపు నీతి నియమాలను ప్రశ్నించాడు. కానీ అవే పద్ధతులు ఇప్పటికీ కొనసాగటం గమనార్హం. సమాజాన్ని, కట్టుబాట్లను ఒంటరిగా ఎదిరించేందుకు సాహసించిన చలం తన మిగిలిన రచనల్లో ఆ పద్ధతిని కొనసాగించాడు.
చలం తన ఆత్మ కథలో వ్రాసుకున్నది ఆయన శైలి గురించి కొంత తెలియచేస్తుంది:
"నేను రచనలు సాగించేటప్పటికి నాకు తెలీకుండానే, నేను మాట్లాడే భాషలోనే రాశాను. తక్కిన కథలని పుస్తకాల భాషలో రాశాను. అసలు ఆనాడు భాషా ఉద్యమం అనేది ఒకటి ఉందని నాకు తెలీదు. చింతా దీక్షితులు (ఈయన కూడ రచయిత, చలంగారికి సహ ఉద్యోగి) గారినించే విన్నాను గిడుగు రామ్మూర్తి గారి పేరు. వారి శిష్యులు ఆలోచించి, భాషని ఎంతవరకు మార్చవచ్చో తూచి రాసేవారు. ఆ యత్నాలు, మడి కట్టుకోటాలు చదివితేనే నాకు అసహ్యం వేసింది. భాష ఎట్లా మారాలో నాకు శాసించాలని చూసేవారు. భర్తని యెన్ని ముద్దులు పెట్టుకొవాలో శాసించినట్లు. కాని ఈ చలం ఓ వరదల్లె వూడ్చుకొచ్చాడు. నా భాషాధాటికి వారికెంత భయమో! పైగా ఆ భాష, భయంలేని, సంకోచంలేని, భీతిలేని, పాత గోడల్ని పడగొట్టే తీవ్రవాది ఓ master stylist చేతిలో పడ్డది. చాలా త్వరలో వీళ్ళ కృతక భాషలన్నీ కుప్పకూలాయి. చలం శైలిలో, రాతలో అంత తీవ్రత అంత inevitibility అంత భయంకరాకర్షణ ఉండిపోయింది. ఒక్కొక్కరే ప్రతిఘటించబోయి, పరాజితులై, నా భాషనే అనుకరించారు గతిలేక. ఇంకో విధంగా రాస్తే వాటిని చదవరు ఎవ్వరూ. ఈ భాష, ఈ భావాలు వీలులేదు అని ఎంతమంది మొత్తుకున్నా, ప్రజలు ఎగబడి చదువుతున్నారు. రచయితలు, పత్రికలు చలం పేరు చెప్పకుండా చలాన్ని అనుకరించటం ప్రారంభించారు. భాషాదిగ్గజాల మొకాళ్ళూగిసలాడే పాత నీతుల గోడలు విరిగి కింద కూలాయి." (ఆత్మకథలో 74-75వ పుటలు)
అటువంటి చలం 1921లో వ్రాసిన నవల "శశిరేఖ". నూటయాభైరెండు పేజీల ఈ నవలను సంక్షిప్తీకరిస్తే..
శశిరేఖ- చలం మాటల్లో చెప్పాలంటే ఏమీ తెలియని ముగ్ధ. అప్పుడే మారుతున్న సమాజంలో నవతరానికి ప్రతినిధిగా కనిపిస్తుంది మొదట్లో. చిన్న వయసులో తనకు ఏమాత్రం ఇష్టం లేని పెళ్లి చేసినందుకు అమ్మతో వాదనకు దిగుతుంది. తనను ఇష్టపడిన రామారావు సీమనుండి వచ్చి తనను వివాహం చేసుకునేవాడు గదా అని ప్రశ్నిస్తుంది. తనకు ఇష్టంలేని వాడితో "కార్యం"కు ఎలా ఒప్పుకోనంటూ నిలదీస్తుంది. థైర్యంగా భర్తతో చెబుతుంది. "నువ్వంటే ఇష్టం లేదు, కార్యం ఇష్టం లేదు, బలవంతం చేయటం న్యాయమా..?" అని. అతను అర్ధం చేసికొనక పోవటంతో కార్యం ముందురోజు రాత్రి తాను ఇష్టపడిన గోవిందపురం లాకుల అధికారి కొడుకు, కృష్ణుడితో ఊరు వదలి వాడపిల్లి వచ్చేస్తుంది.
కృష్ణుడు-శశిరేఖ, ఇద్దరూ ప్రకృతి ప్రేమికులు. అందాన్ని ఆస్వాదిస్తూ అన్నపానాలను మరచిపోయేవాళ్లు. కృష్ణుడు శశిరేఖ తనతో ఉంటే చాలుననుకుంటాడు. ఆమె కోసం వైద్యవిద్యను మధ్యలో వదిలేసి వచ్చేస్తాడు. అప్పుడే పూసిన మొగ్గల్లే ఉన్న తనని అపురూపంగా చూసుకుంటాడు. ఒకరికి ఒకరు ఎదురు ఉంటే చాలు ఆకలిదప్పులు ఉండవనుకుంటారు. వాడపిల్లిలో ఉన్న కృష్ణుడి మితృడు, డాక్టరు సుందర రావు ఆశ్రయం పొందిన వీరు ప్రకృతిని ఆస్వాదిస్తూ కాలం గడిపేస్తారు. మూడేళ్ల తర్వాత తిరిగి సొంతఊరు గోవిందపురం వచ్చేస్తారు, మితృడు సుందర రావుతో సహా!
ఒకనాటి రాత్రి పడవలో షికారుకి వెళ్లినప్పుడు కాలువలో పడిపోతుంది. సుందర రావు దగ్గర వైద్యం చేయించుకుంటుంది. సుందర రావుకి ఆమెపై కోరిక ఉండటం, తనకూ అతనంటే ఇష్టం కలగటం వలన బలవంతంగా అతనితో ఒకరాత్రి గడుపుతుంది. కృష్ణుడిపై ప్రేమ తగ్గిపోయినప్పుడు అతని వద్ద ఉండటం నీతి కాదని సుందర రావుతో ఊరువదలి వచ్చేస్తుంది. తనకోసం ఎదురుచూస్తున్న కృష్ణుడికి తనను మరచిపొమ్మని చీటీ పంపిస్తుంది.
ఈ సంఘటనకు ఉపోధ్ఘాతముగా, చలం అంటాడు.. "ఆమె పాదములకు నమస్కరించి, తాకిన ఆమె దేహమెక్కడ కందునో అని ఆమెను దేవతగ పూజించు భక్తునితో ఆమెకవసరము తీరినది. ఆమెను నలిపి జీవన రసమును పిండి, తాగి మూర్ఛనొందించగల ప్రేమనామె వాంచింఛెను. అగ్ని వలె తాపమున దహించు తృష్ణకు, ఉపశమనముగ మహా ప్రళయ, మేఘముల గర్జించు చండవర్షమే కావలెను."
శశిరేఖతో ఎన్నో అందమైన ప్రదేశాలు తిరిగిన తర్వాత సుందర రావు బళ్లారిజిల్లాలో ఉద్యోగంలో చేరుతాడు. కాలం గడచిన కొద్దీ, ఆమెను అనుభవించిన కొద్దీ శశిరేఖపై మోహం పోయి ఆమె అతనికి భారంగా కనిపిస్తుంది. అందముగా కనబడేకొద్దీ ఆమెను మాటలతో హింసించాలని చూస్తాడు. చివరికి అతనిపై ప్రేమ మాయమై, అతనిని విడిచి తిరిగి గోవిందపురం వెళ్లటానికి బయల్దేరుతుంది. కానీ సుందర రావుకి ప్రమాదం జరగటం వలన ఆగిపోవలసి వస్తుంది. నెలరోజులపాటు అతనికి సేవలు చేసి ఆరోగ్యం కుదుటపడేలా చేస్తుంది. ఫలితంగా అతను ఆమెతో మళ్లీ ప్రేమగా ఉండాలనుకుంటాడు. సుందర రావుకి వైద్యం చేస్తున్న డాక్టరుని ఎక్కడో చూసిన గుర్తుతో వివరాలు సేకరిస్తుంది. అతనే తనను పెళ్లి చేసుకుంటానన్న రామారావని తెలుసుకుని స్నేహం చేస్తుంది.
రామారావుకి తన గతం గురించి చెప్తుంది శశిరేఖ. బ్రహ్మ సమాజంలో తిరిగే అతను ఆమెను పెళ్లి చేసుకుంటానంటాడు. సుందర రావుని వదలి తనతో వచ్చేయమంటాడు. తీసుకెళ్లి వేరే ఇంటిలో ఉంచి పదిహేనురోజుల తర్వాత పెళ్లి అంటాడు. తనతోపాటే ఉంటానంటుంది శశిరేఖ. పెళ్లికి ముందు కలిసి ఉండటం సమాజం హర్షించదంటాడు రామారావు. ఈలోపు సుందరరావు వస్తాడు. పాతవన్నీ గుర్తు చేసి శశిరేఖను చెన్నపట్నం తీసుకునిపోతాడు. ఆమె తనమీద ఆధారపడి ఉన్నదన్న అహంకారంతో మళ్లీ హింసించటం మొదలుపెడతాడు.
సుందర రావుమీద అసహ్యంతో ఇల్లు వదలి వచ్చిన శశిరేఖను బ్రహ్మమత ప్రచారకుడు, నవజివనదాసు ఆదరిస్తాడు. కన్న బిడ్డలా చూసుకుంటాడు. ఆమె గతం తెలుసుకున్న తర్వాత తనకు తెలిసిన ధర్మారావుతో పెళ్లి చేద్దామనుకుంటాడు. కాని, పెళ్లి మీద ఏమాత్రం నమ్మకం లేని శశిరేఖ గట్టిగా వ్యతిరేకిస్తుంది. ప్రేమ లేని చోట తానుండలేనని, పెళ్లి అంటే ప్రేమను వదులుకోవటమే అంటుంది. అడవిలో స్వేచ్చగా తిరిగే చిలుకను పంజరంలో బంధించటమే పెళ్లి అంటుంది.
తన మనసు మార్చేందుకు బ్రహ్మ సమాజ కార్యక్రమాలకు హాజరుకావాలని కోరతాడు నవజీవన దాసు. కలకత్తాలొ జరిగే సమావేశాలకు హాజరైతే ఆమె గతంలో చేసిన తప్పులను తెలిసికొంటుందనీ, ఈశ్వర ప్రేమకు పాత్రురాలవుందనీ తద్వారా.. ధర్మారావుని పెళ్లి చేసుకుంటుందని ఆశిస్తాడు.
అప్పటికే బ్రహ్మసమాజంలో ఉన్న రామారావు, శశిరేఖను కలకత్తాలో కలుస్తాడు. తనను మోసం చేసిందని నిందిస్తాడు. "నా మనసు నీకే అర్పితం" అంటుంది శశిరేఖ. బ్రహ్మ సమాజంలోని వారిని చూసి ఎంత సంతొషముగా ఉన్నారో అని అనుకుంటుంది. తనను పెళ్లి చేసుకుంటే ఇక్కడే ఉండిపోయేలా ఏర్పాట్లు చేస్తానంటాడు ధర్మారావు. తన మౌనాన్ని అంగీకారంగా భావించిన ధర్మారావు నవజీవనదాసుతో శశిరేఖ పెళ్లికి ఒప్పుకుందని చెప్తాడు.
ఈవిషయం రామారావుకి తెలిసి శశిరేఖను నిలదీస్తాడు. తను, "నేను నీ సొంతం" అంటుంది. పెళ్లికి మాత్రం ఒప్పుకోకుండా తనతో ఉండిపోమంటుంది. మగ స్నేహితుల వలే కలిసి ఉందామంటుంది. వివాహమనే బంధం లేకుండా స్త్రీపురుషులు కలిసి ఉండటాన్ని సంఘం హర్షించదంటాడు రామారావు. పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకోమంటాడు. చిన్నప్పుడు చేసిన వాగ్దానాన్ని నిలుపుకునేందుకే తనను పెళ్లి చేసుకుంటానంటున్నావంటుంది శశిరేఖ. సాయంత్రం లోపు నిర్ణయం చెప్పమని వెళ్లిపోతాడు రామారావు.
ఆరోజు సాయంత్రం శశిరేఖ రామారావుని శారీరకంగా కూడా కలుస్తుంది. అంతా అయిపోయాక కళ్లుతెరిచిన రామారావు ఆమెను అక్కడే వదిలేసి వెళ్లి పోతాడు. తన తప్పు తెలుసుకుని తిరిగివచ్చేసరికి ఆమె కొన ఊపిరితో ఉంటుంది. చివరికి అతని చేతిలో కన్నుమూస్తుంది.
———————————————————–
ఈ నవలలో ఉన్న ప్రధాన పాత్రలు ఐదు.
శశిరేఖ, కృష్ణుడు, సుందర రావు, రామారావు, నవజీవన దాసు.
ముందు మాటలో శివశంకర శాస్త్రి అన్నట్లు.. శశిరేఖ ప్రేమైక జీవిని. ప్రేమ లేని చోట తను ఒక్క నిమిషం నిలువలేకపోయింది. రామారావు వచ్చి తనను పెళ్లి చేసుకుంటాడనుకున్న ఆమే.. పెద్దవాళ్లనెదిరించి కృష్ణుడితో వెళ్లిపోయింది. సుందర రావు ఫిడేలు గానం, తీయని మాటల ప్రభావంతో.. అతనిపై ఆకర్షణ పెంచుకుంది. అందము, సౌందర్యారాధనలొ మునిగిపోయే ఆమె అతని ప్రభావంలో పడిపోయింది. ఆవేశంలో అతను ముద్దుపెట్టి, తర్వాత కోపం ఉందా అంటే లేదని చెప్పింది. ఆసుపత్రి నుండి ఇంటికి వెళ్లే ముందు రోజు రాత్రి ఒంటరిగా సుందర రావు ఇంటికి వెళ్లింది. వయసు గారడీ, అతని బలవంతము వలన లొంగిపోయింది. ఉదయం కృష్ణుడి దగ్గరకే వెళ్లమనిన సుందరరావుతో.. "నాకు నీమీద ప్రేమలేకపోతే నా చిటికిన వేలునైనా తాకనిచ్చేదాన్నా మిమ్మల్ని?" అని ప్రశ్నిస్తుంది. అప్పటి వరకు తననెంతో ప్రేమగా పూజించిన కృష్ణుడిని వదలి వెళ్లుటకు ఇష్టంలేకపోయినా.. అతనంటే ఇప్పుడు ప్రేమ లేదు కనుక ఇంకా అతనితో ఉండటం భావ్యం కాదని భావించింది. సుందరరావుతో ఊరు విడిచి వెళ్లిపోయింది. మోహం తీరిన సుందరరావు కౄరత్వాన్ని చూచిన ఆమెకు అతనిపై ప్రేమ తగ్గిపోయింది. తర్వాతి పరిణామాల వలన చిన్ననాటి మితృడు రామారావుతో కలిసి జీవించాలనుకుంటుంది. అతను పెళ్లికి పట్టుపడితే.. పెళ్లి తర్వాత ఇతను మాత్రం వదిలేయడని ఋజువేంటని ఆలోచిస్తుంది. పెళ్లి అంటే స్వాతంత్ర్యమును కోల్పోవటమేనని, "ఒకవేళ పెళ్లితర్వాత ఇప్పుడున్న ప్రేమ పోతే నన్ను ఇష్టం వచ్చినట్లుగా పోనిస్తారా?" అని అడుగుతుంది. తప్పనిసరై పెళ్లికి ఒప్పుకున్నా, సుందర రావు బలవంతముతో మళ్లీ అతనితో వెళ్లిపోతుంది. చెన్నపట్నంలో నవజీవనదాసు ఆశ్రయంలో కొన్నాళ్లు సంతోషంగానే గడిపినా, తనకు పూర్వ జీవితమే బాగుందనిపిస్తుంది. కలకత్తాలో రామారావును మళ్లీ కలిసిన తర్వాత అతని ప్రేమ తప్ప మరేమీ అక్కరలేదనిపిస్తుంది. ఓక రాత్రి అతనితో కలిసిన తర్వాత, అతని ప్రేమను తట్టుకోలేక గుండెనొప్పితో కన్నుమూస్తుంది.
కృష్ణుడు అందాన్ని ఆస్వాదించే వాడైతే.. సుందరరావు అనుభవించాలని చూసేవాడు. కృష్ణుడు శశిరేఖ అమాయకత్వాన్ని, అందాన్ని, దోసిలిలో పట్టి ప్రేమగా చూసుకుంటే.. సుందర రావు ఆమె శరీరాన్ని గుప్పెటలో నలిపి వేశాడు. తనను వదిలి వచ్చిన తర్వాత శసి క్షేమం కోరుతూ కృష్ణుడు ఉత్తరం వ్రాస్తే.. సుందర రావు మోహం తీరిన తర్వాత ఇంట్లోంచి బయటకు గెంటివేసాడు. వీళ్లిద్దరూ భిన్నదృవాళ్లా, నాణేనికి చెరో వైపులా కనిపిస్తారు. శశిరేఖ కృష్ణుడి వద్ద ఉన్నంతకాలం ఆమె కోసం వెంపర్లాడిన సుందరరావు, ఆమె తనతో వచ్చేయగానే ఆమె ఎక్కడికి పోతుందన్న నిర్లక్ష్యము ఏర్పడింది. కొన్నాళ్లకు ఆమె మోయలేని బరువుగా తోచింది. ఫలితంగా ఆమెకు దూరమైనాడు.
రామారావు అప్పటి బ్రహ్మసమాజపు ప్రతినిధి. ఉన్నత విద్యలు చదివినా సంఘం నిర్మించిన చట్రాన్ని, గీసిన గీతను కాదనే సాహసం చేయలేకపోయాడు. చిన్నప్పుడు శశిరేఖకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని తపించినా, ఒక చెడిపోయిన స్త్రీని బాగుచేశానన్న పేరు కోసమే అతను నడచుకున్నట్లు కనిపిస్తుంది. వెలుతురులో ఎన్నో ఆదర్శాలు పలికే వారు చీకటిలో తప్పులు ఎలా చేస్తారో, నిగ్రహాన్ని ఎలా కోల్పోతారో రామారావు మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తాడు.
నవజీవనదాసు బ్రహ్మసమాజపు ప్రచారకుడు. తప్పుడుదారిలొ నడచే అమ్మాయిని బాగుచేసి, పాపాలకు పరిహారం చూపి, ఆమెకు ఒక కొత్త జీవితం ఇవ్వాలని ఆశించాడు. ఐతే ధర్మారావుతో ఆమె పెళ్లికి నిరాకరించటం, రామారావుతో సన్నిహితంగా మెలగటం అతనికి కోపం తెప్పిస్తుంది. కాని, ఆమె తన కూతురివంటిదనీ, ఆమె కోరుకున్న జీవితం గడపవచ్చనీ అనే సమయానికి పరిస్థితి చేజారిపోతుంది. ఆమె చనిపోయిన రాత్రి, కలలో దేవదూతలతో అతను "ఈమె ధన్యురాలు, ప్రేమించినది" అనటం ద్వారా మార్పుని ఆహ్వానించినట్లుగా కనిపిస్తుంది.

Published @ Pustakam.net

22, జులై 2009, బుధవారం

సంపూర్ణ సూర్య గ్రహణం

5, జులై 2009, ఆదివారం

వీరప్పన్ లాగే ప్రభాకరన్ కూడా! (Interview - Final Part)

గత టపా నుంచి..

నేను: మరి ప్రభాకరన్ గురించి ఏం తెలుసు నీకు?
శ్రీనివాస దురై: ప్రభాకరన్ కూడా వీరప్పన్ లాంటోడేనబ్బా.. నమ్మినోడ్ని మోసం చేయలా.. మోసం చేసినోడ్ని విడిచిపెట్టలా..
నేను: అంటే..
శ్రీనివాస దురై: అంటే ఏముండాది? చిన్నప్పట్నుంచి మావోళ్ల(తమిళుల) మీద జరిగిన దాడులు చూస్తావుండాడు. ఏదో ఒకనాటికి లంకోళ్లకి బుద్ధి చెప్పాలనుకున్నాడు. తోడువచ్చినోళ్లతో కలిసి పోరాటం చేశాడు.
నేను: ప్రభాకరన్‌ని చాలా మంది తమిళులు నమ్మారు. ఆశ్రయమిచ్చారు. కాని, చివరికి వాళ్లకేం మిగిలింది?
శ్రీనివాస దురై: చూడబ్బా.. యుద్ధమంటే మాటలనుకుంటాండావా? అదేదో కిర్‌కెట్ మ్యాచు టీవీలో చూడటమనుకుంటన్నావా? యుద్ధమంటే ఒకటేనబ్బా.. చంపటం.. లేదా చావటం. అదీ చుట్టూ వాళ్లున్నప్పుడు మాట కోసం నిలబడాల. లొంగిపోయావా.. ఇక నువ్వు బతికినా చచ్చినట్లే. ఆ బతుకు కన్నా చావటమే మేలు.
నేను: అంటే..
శ్రీనివాస దురై: ఏందబ్బా.. అంటే అనేది ఊతపదమా ఏంది నీకు? ప్రతీది తెలియదంటాండావే?
నేను: అది కాదు.. అసలెందుకు చేశాండంత యుద్ధం ప్రభాకరన్?
శ్రీనివాస దురై: ప్రభాకరన్ చిన్నప్పుడే తుపాకీ పట్టాడు. తమిళోళ్లని ఏడిపించుకుతినేటోళ్లమీద యుద్ధం మొదలెట్టాడు. తనతొ నలుగురిని కలుపుకున్నాడు. సుమారు నలభై ఏళ్లు పోరాడాడు.
నేను: ఎవరికీ లేనిది ప్రభాకరన్‌కే ఎందుకు అంత కోపం?
శ్రీనివాస దురై: నీదేఊరబ్బా?
నేను: తెనాలి. అసలైతే అమరావతి పక్కన. నా చిన్నప్పుడు తెనాలి వచ్చాం.
శ్రీనివాస దురై: సరే, నీపక్కింటోడు వచ్చి నీదీ ఊరు కాదు కదా.. నీకు తాగటానికి నీళ్లియ్యం, తినటానికి గింజలివ్వమంటే ఏం చేస్తావు?
నేను: వాళ్లిచ్చేదేముంది?
శ్రీనివాస దురై: అదేనబ్బా.. నీకు ఏదీ అమ్మనీకుండా, వాళ్లు చెప్పినట్లుంటేనే బతకనిస్తాం అంటే?
నేను: నేనెందుకు ఒప్పుకోవాలి?
శ్రీనివాస దురై: ఏం.. ఎందుకొప్పుకోవు?
నేను: నన్ను వెళ్లిపొమ్మనటానికి వాళ్లకేమీ హక్కు లేదు కదా..
శ్రీనివాస దురై: నిన్నొక్కడ్ని అంటేనే నువ్వు ఊరుకోలేకపోతున్నావే.. లంకనుండి కొన్ని లక్షలమందిని వెళ్లిపోమన్నారబ్బా.. కొంత మంది తిరగబడ్డారు. చంపారు. ఇంకొంతమంది ముఠా కట్టి ఎదురు దాడులు చేశారు. పట్టుకుని కాల్చి చంపారు. అప్పుడే కుర్రాళ్లకి కోపమొచ్చింది. పధకం ప్రకారం దాడులు మొదలుపెట్టారు.
నేను: అసలెందుకిదంతా?
శ్రీనివాస దురై: లంకలో ఉన్న అరవోళ్లంతా.. ఒకప్పుడు ఇక్కడోళ్లే. కూలీకి తీసుకెళ్లారంటెప్పుడో. అక్కడ లంకోళ్లు పెట్టే బాధలు పడలేక అరవోళ్లు తిరుగుబాటు చెశారు. అప్పుడే ప్రభాకరన్ తుపాకీ పట్టుకున్నాడు.
(ఎల్‌టీటీఈ పుట్టుక, కారణాల గురించి, రాజీవ్‌గాంధీ హత్య కేసు దర్యాప్తు చేసిన శ్రీ. కార్తికేయన్ గారు, తన పుస్తకం - "నిప్పులాంటి నిజం"లో వ్రాసారు.
అందులోంచి సంగ్రహిస్తే..


1815లో లంకలోని టీ, కాఫీ ఎస్టేట్లలో పని చేసేందుకు కూలీల కోసం బ్రిటిష్ ప్రభుత్వం ఇక్కడ్నుంచి మనుషులని తరలించింది. కొన్ని వేలమంది అలా ఇక్కడ్నుంచి బలవంతంగా కాని, ఇష్టపడి కాని శ్రీలంక వెళ్లారు. అక్కడ వారికి ఎస్టేట్లలో కొంత భూమి ఉండటానికి ఇచ్చి కూలీ చేయించుకునేవాళ్లు. వందల సంవత్సరాలు అక్కడే ఉన్నా వాళ్లంతా ద్వితీయ శ్రేణి పౌరులుగానే మిగిలిపోయారు. అక్కడే పుట్టిన తర్వాతి తరం వాళ్లుకూడా వివక్షనెదుర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చాక కూడా వాళ్ల పరిస్దితి మారలేదు. అప్పటికి శ్రీలంకలో ఉన్న తమిళులు పది లక్షలమందికి పైనే. తమిళులు ఎక్కువగా ఉన్న తూర్పు, ఉత్తర ప్రాంతాల్లో భూములు వ్యవసాయానికి ఎక్కువగా పనికొచ్చేవి కాకపోవటంతో.. వారు చదువుకి ప్రాధాన్యతనిచ్చారు. బ్రిటిషువారితో వచ్చిన మిషనరీలు ఇంగ్లీషు విద్యనందించాయి. పాలనా సౌలభ్యం కోసం బ్రిటిషువారు ఈ తమిళులని సింహళీయులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా డాక్టర్లుగా, ఇంజనీర్లుగా ఇతర ఆఫీసర్లుగా నియమించారు. ఇది శ్రీలంకలొని ప్రధమ పౌరులుగా చెప్పుకుంటున్న వారికి కోపం తెప్పించింది. దీనితొ తమిళులలో సంఘీభావం పెరిగింది. 1947లో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో వారు ఏడుగురు సభ్యులని పార్లమెంటుకి పంపారు. ఈ సంఘటనతో సింహళియులు మరింత జాగ్రత్త పడదామనుకున్నారు. మెజారిటీ సభ్యులు వాళ్లే కనుక 1948-పౌరసత్వ చట్టం, 1949-పార్లమెంటరీ ఎన్నికల చట్టం తీసుకువచ్చారు. ఫలితంగా టీ తోటల్లోని తమిళ కార్మికులంతా ఓటుహక్కు కోల్పోయారు. తమకంటూ ఒక్క రాష్ట్రం కూడా లేకుండా మిగిలిపోయారు. ప్రధానమంత్రి సేనా నాయకే తమిళ ప్రాంతాల్లో సింహళీయుల జనాభా పెరిగేందుకు, నీటి పధకాలతో కృషి చేశాడు. దీనితో తూర్పు ఉత్తర ప్రాంతాల్లో ఇరవై ఏళ్లలో సింహళీయుల జనాభా పదిరెట్లు పెరిగింది. ఇది అక్కడి జనాభా నిష్పత్తిని తీవ్రంగా ప్రభావితం చేసింది. దీనితో చరిత్ర పునరావృతమవుతుందేమో అని తమిళులు భయపడ్డారు. క్రీ. పూ. 101లో తమిళ రాజు ఎలారాను ఓడించిన సింహళరాజు దుత్తగామి కాలం మళ్లీ వస్తుందేమో అని వారు భావించారు [అంటే లంకలో తమిళులు ఎప్పుడో ఉన్నారన్న మాట].
1956లో సింహళం శ్రీలంక అధికారిక భాషగా, భౌద్ధమతం జాతీయమతవిధానంగా ఆమోదింపబడినవి. సింహళీయులకి, తమిళులకి మధ్య జరిగిన ఘర్షణలతో, తమిళులు కొలంబో వదిలేసి జాఫ్నా వెళ్లిపోయారు. 1961లొ మరో చట్టం అమలులోకి వచ్చింది. న్యాయస్ధానాలన్నింటిలో సింహళం మాత్రమే అధికార భాషగా మారింది. 1970లో వచ్చిన శ్రీలంక కొత్త రాజ్యాంగం శ్రీలంక గణతంత్ర రాజ్యంగా, సింహళం అధికార భాషగా, భౌద్ధం ప్రధాన మతంగా ప్రకటించింది. దీనితో సింహళీయుల ఆధిపత్యం ఒక్కసారిగా పెరిగింది. తమిళులు నేర్చుకున్న ఇంగ్లీషు కంటే సింహళానికే ప్రాధాన్యం పెరిగి తమిళ ఉద్యోగులు, విద్యార్ధులు దిక్కు తోచని స్థితిలో పడ్డారు. దీనితో తమ సమస్యల పరిష్కారం కోసం తమిళులు విభిన్న పంధాను ఎన్నుకున్నారు. అదే తీవ్రవాద పోరాటం. 1972లో తంగదురై, కుట్టిమణి ల సారధ్యంలో ఏర్పడిన సంస్ధ, తర్వాత 'తమిళ ఈలం లిబరేషన్ ఆర్గనైజేషన్ - "టీఈఎల్ఓ"గా మారింది. 1972లో "తమిళ న్యూ టైగర్స్"ని వేళుపిళ్లై ప్రభాకరన్ స్ధాపించాడు. అప్పటికి అతని పద్దెనిమిదేళ్లు. 1975 జులై 27న జాఫ్నా మేయరు- ఆల్ఫ్రెడ్ దురైయప్పను ప్రభాకరన్ కాల్చి చంపాడు. తమిళుల హీరో అయ్యాడు. 1976 మే 5న ప్రభాకరన్ తన "టిఎన్‌టి" ని లిబరేషన్ తైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (ఎల్‌టీటీఈ)గా మార్చాడు. తమిళ స్వరాజ్యమే తన ఏకైక లక్ష్యంగా ప్రకటించాడు.)

నేను: సరే.. అదంతా తెలిసిన విషయమే కదా..
శ్రీనివాస దురై: అక్కడికే వస్తుండానబ్బా.. వీరప్పన్ లాగే ప్రభాకరన్ కూడా తన కోసం కన్నా తనను నమ్ముకున్న మనుషులకోసమే ఎక్కువ కష్ట పడ్డాడు. అలాగే.. తనకెదురొచ్చిన ఎవరినైనా అడ్డు తొలగించుకున్నాడు.
నేను: కానీ ప్రభాకరన్ ఒక లక్ష్యం కోసం పోరాడాడు కదా.. వీరప్పన్ అలా కాదు. అందరినీ బెదిరించి, దోపిడీ చేశాడు.
శ్రీనివాస దురై: అవునబ్బా.. వీరప్పన్ దోపిడీ చేశాడు. కాదనటంలే.. ఐతే ప్రభాకరన్ కూడా తన మనుషులకోసం దాడులు చేశాడు. ఆయుధాలు, డబ్బు దోచుకున్నాడు. అలాగే వీరప్పన్ కూడా తనని నమ్ముకున్న వాళ్లకి ఎంతో డబ్బు సాయం చేశాడు. ఎంతో మందికి పెళ్లిళ్లు చేశాడు. ఒకరకంగా చెప్పాలంటే వీరప్పన్ వల్ల తన చుట్టూ ఉన్న వాళ్లు బాగు పడ్డారు. ప్రభాకరన్ వల్ల అంతా నాశనం అయ్యారు.
నేను: ప్రభాకరన్ పోరాటయోధుడు, వీరప్పనేమో దోపిడీదారు. అసలు వీళ్లిద్దరినీ నువ్వెలా కలిశావ్? ఎప్పుడు కలిశావ్?
శ్రీనివాస దురై: వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుందబ్బా.. ముత్తు లక్ష్మి నాన్న నాకు దూరపు బంధువు. వాళ్ల ఊరికి అప్పుడప్పుడు వచ్చిపోతుండేవాడు. అలా కలిసేవాణ్ణి. 1985తర్వాత నేను శ్రీలంక వెళ్లాను, అక్కడ పనిచేయటానికి. మాంకులం (ముల్లైతీవు నుండి 100కి.మీ. ఉంటుందేమో, నాకు గూగుల్ మ్యాప్‌లో కనిపించింది తర్వాత వెదికితే) దగ్గర ఒక పల్లెటూళ్లో నూనె ఫ్యాక్టరీలో ఐదేళ్లు పైనే పని చేశాను. ప్రభాకరన్ రాజ్యమే అదంతా. అతనేది చెబ్తే అదే జరుగుతుంది అక్కడ. రాజీవ్ గాంధీని వాళ్లు చంపేశాక అక్కడి పరిస్ధితులు బాగోలేదు. ఇండియా నుంచి వచ్చిన వాళ్లు చాలా మందే ఉన్నారప్పుడక్కడ. టైగర్ల గురించి చెప్పమని మిలిటరీ వాళ్లు వేధించేవాళ్లు. ఇక ఉండలేక ఆరుగురం వచ్చేశాం అక్కడినుండి. అది ప్రభాకరన్ ప్రాంతమవటంతో అప్పుడప్పుడు జనాల్లోకి వచ్చేవాడు. తమిళ రాజ్యం రావాలంటే త్యాగాలు తప్పవనేవాడు. ఒక్కో ఇంటి నుంచి ఒక్కళ్లని తనతో పంపమని అడిగేవాడు. ఇండియా నుండి వచ్చిన సైనికులంటే మాత్రం అసహ్యించుకునేవాడు. వాళ్ల వల్ల అమాయకులు బలవుతున్నారని అనేవాడు. పని చేసుకోటానికి వచ్చిన వాళ్లని మాత్రం ఇబ్బంది పెట్టద్దనేవాడు. వాళ్లు ఇక్కడ బాగుంటేనే ఇండియాలో సహాయం చేస్తారని చెప్పేవాడు. కనీసం పది సార్లు చూశాను నేను ప్రభాకరన్‌ని.
నేను: అసలు అంత ఈజీగా ప్రభాకరన్ దగ్గరకు వెళ్లే అవకాశం ఉంటే ఎప్పుడో చంపే వాళ్లు కదా?
శ్రీనివాస దురై: అదేమీ అంత ఈజీ కాదు. మేము పని కోసమే వెళ్లినా మా భాధ్యతంతా మా ఓనర్‌ల మీద ఉండేది. పూర్తిగా నమ్మకమైన వాళ్లనీ, అది కూడా అరవోళ్లని మాత్రం తెచ్చుకోమనే వాడు. పనోళ్లు తప్పు చేస్తే ఓనర్‌లను చంపేసేవాడు. అందుకే అంత త్వరగా ఎవరిని దగ్గరకి రానిచ్చేవారు కాదు.
నేను: మరి నువ్వెలా వెళ్లావ్?
శ్రీనివాస దురై: అదే చెబుతుండా.. మా ఓనరు పేరుకే ఓనరు. ఆ మిల్లు ప్రభాకరను డబ్బులతో నడుస్తుండాదనేవారు. వాళ్లు అక్కడికి వస్తే మా మిల్లులోనే మీటింగు పెట్టేవాళ్లు. ఒకసారి నీళ్లు కావాలంటే మా ఓనరు నన్ను పంపాడు సీసా ఇచ్చి. అతని పక్కనున్నోళ్లు నన్ను తాగమన్నారు ముందు. అంత జాగ్రత్త. ఇక్కడేపని చేస్తావని అడిగాడు నన్ను. తమిళనాడులో ఎక్కడ నీఊరని అడిగాడు. తమిళ రాజ్యం వస్తే ఇక్కడికొచ్చేస్తారా అని అడిగాడు.
నేను: ఏమని చెప్పావ్ మరి?
శ్రీనివాస దురై: రానని చెప్పా. అది నేను పుట్టిన ఊరని చెప్పా. నవ్వాడు. మరి ఇప్పుడెందుకొచ్చావ్? అని అడిగాడు. బతకటానికని చెప్పా. అంతా ఇక్కడ చంపుతున్నారని అనుకుంటుంటే నువ్వు బతకటానికొచ్చావా? అని అడిగాడు. బతికే ఉన్నాను కదా ఇప్పుడని నవ్వా నేను కూడా. తర్వాత మా ఓనరు తిట్టాడు నన్ను అలా మాట్లాడానని.
నేను: మిగతా వాళ్లకి తెలియని విషయాలేంటి మరి?
శ్రీనివాస దురై: ప్రభాకరన్ ఏదుంటే అది తినేస్తాడు. ఉన్నప్పుడు బాగా తింటాడు. పాటలు పాడతాడు. రేడియో వింటాడు. పెళ్లాం పిల్లలంటే ప్రేమ ఉండేది బాగా. తన జీవితం గురించి తెలిసి కూడా తనని పెళ్లి చేసుకుందని పెళ్లాన్ని బాగా చూసుకునేవాడు. తను చనిపోయినా పెళ్లాం పిల్లలు బాగుండాలని కోరేవాడు.
నేను: ప్రభాకరన్ మంచోడా? లేక వీరప్పన్ మంచోడా?
శ్రీనివాస దురై: ఇద్దరూ ఇద్దరేనబ్బా.. అనుకున్న దానికోసం ప్రాణాలిస్తామన్నారు. అలాగే పోయారు. ఈలోకంలో ఎవడూ మంచోడు కాడబ్బా.. అందరికీ మంచిగా కనిపించటం కూడా కుదరదు. నేను: ఇద్దరిలో ఏం పోలికలు చూశారు మీరు?
శ్రీనివాస దురై: ప్రభాకరన్, వీరప్పన్ ఇద్దరూ తమ చుట్టూ ఉన్న వాళ్ల కోసమే కదా ఏంచేసినా.

ఇద్దరూ మంచి గురిగాళ్లు. శతృవుని చంపేటప్పుడు కౄరంగా చంపేవోళ్లు. అలా ఐనా తమకోసం వచ్చేవాళ్లు భయపడి వెనక్కి తగ్గుతారని వీరప్పన్ అనేవాడు. వాడు రావటం ఎందుకు? నా చేతిలో చావటం ఎందుకని అనేవాడు. ఇద్దరూ డబ్బుని పక్కన వాళ్లకోసమే ఖర్చు చేశారు. ప్రభాకరన్ వ్యాపారాలు చేశాడంటారు, మరదేమయిందో కానీ, వీరప్పన్ మాత్రం ఏమీ మిగుల్చుకోలేదనుకుంటా. ఇద్దరూ పెళ్లాల్మ్ పిల్లలకు దూరంగా ఎక్కువ కాలం గడిపారు కదా.. కానీ ఇద్దరి పెళ్లాలూ, వాళ్ల గురించి తెలిసే ఇష్టపడి చేసుకున్నారు. ఇద్దరూ కూడా ఎన్‌కౌంటర్లోనే చనిపోయారు కదా..
నేను: చాలా టైం తీసుకున్నాను పెద్దాయనా.. వాళ్లిద్దరికీ డూపులున్నారని అనేవాళ్లు కదా.. ఎంతవరకూ నిజం?
శ్రీనివాస దురై: ఏరబ్బా.. డూపులు? వాళ్లు చచ్చి ఇన్నాళ్లయింది కదా.. మీవాళ్లు ఊరికే వదులుతారా? ఈపాటికి ఒక్కడ్నైనా లాగి జనానికి చూపందే ఊరుకుంటారా?
నేను: సరే.. మరి వీళ్ల ఎన్‌కౌంటర్లు నిజమేనంటావా?
శ్రీనివాస దురై: ఒక్కటబ్బా.. వాళ్లైనా, పోలీసులైనా మనుషులే కదా.. వాళ్లకి దొరికినోళ్లని హింసించి చంపారు కదా.. పోలీసులు మాత్రం ఊరుకుంటారా? నేనైనా అంతే చేస్తానబ్బా.. ఐనా అది జరిగినప్పుడు నువ్వూ నేను దగ్గర లేము కదా.. మనకెందుకు ఆ గొడవ?



ఇక్కడ ఒక విషయం నేను చెప్పాలి. శ్రీనివాస దురై ఎంత వరకు నిజాలు చెప్పారన్నది నేను విశ్లేషించలేను. కనుక ఈ విషయాలన్నీ నిజమేనని నేను ఎవరికీ ఎంత మాత్రం హామీ ఇవ్వటం లేదు. కొన్నింటికి నాకు తెలిసిన అదనపు విషయాలను మాత్రం జోడించాను. అనుకోకుండా కలిసిన వ్యక్తితో ఒక చిన్న టీ హోటల్‌లో జరిగిన ఈ సంభాషణకు నా దగ్గర ఎటువంటి రికార్డులు కూడా లేవు, పేర్లు, సంవత్సరాలూ వ్రాసుకున్న చిన్న కాగితం తప్ప.

3, జులై 2009, శుక్రవారం

వీరప్పన్ లాగే ప్రభాకరన్ కూడా! (Interview - First Part)




గత నెలలో నెల్లూరు దగ్గర ఒక ఊరు వెళ్లాను. అక్కడ ఒకతను పరిచయమయ్యాడు. పేరు శ్రీనివాస దురై. వయసు 65-70. తమిళనాడులొని చెంగల్పట్టు దగ్గర ఓ పల్లెటూరు. ఇప్పుడు అతని పరిచయం ఎందుకంటే.. అతను వీరప్పన్‌నీ, ప్రభాకరన్‌నీ చూశాడు. మాట్లాడాడు. వాళ్ల గురించి కొద్దిగా.. మిగిలిన వాళ్లకి తెలియవనుకుంటున్న విషయాలు చెప్తానన్నాడు.

"సరే" అని ఒక హోటల్‌లో కూర్చున్నాం.

నేను: మీకు మాత్రమే తెలిసిన ఆ విషయాలేంటో చెప్పండి.
శ్రీనివాస దురై: వీరప్పన్ చాలా మంచివాడబ్బా.. తన వాళ్లకోసం చాలా చేశాడు.
నేను: ఎవరైనా తన వాళ్లకోసమే కదండీ ఏం చేసినా.. లేకపోతే వాళ్లేమైనా చనిపోయాక తీసుకుపోతారా? ఆమాత్రం తెలుసులెండి ఎవరికైనా..
శ్రీనివాస దురై: అదికాదబ్బా.. వీరప్పన్ చుట్టూ చాలా బలగం ఉండేది. తమిళనాడు-కర్ణాటక మధ్యన అతని సామ్రాజ్యం. ఊటీ-మైసూరు మధ్యన అడవుల్లోని చెట్లన్నీ అతనికి పరిచయమే. ఎవడైనా అతని అనుమతి లేకుండా అటువైపు వెళ్లాడా.. ఇక అంతే. ప్రాణాలమీద ఆశలొదులుకోవాల్సిందే!
నేను: అంటే చంపేస్తాడా?
శ్రీనివాస దురై: ఉత్తినే చంపడబ్బా.. ముందు అనుమానంగా తిరిగేటోడ్ని ఆడ(అక్కడ) జనాలే పట్టుకుంటరు. సత్యమంగళం అడవుల్లో అతని మనుషులు చాలామందే ఉండారు. ముందు నువ్వెవరూ అంటారు. ఈడకెందుకొచ్చినవ్, ఎట్లొచ్చినవ్ అంటారు. ఆడు సరైన సమాధానం చెప్పాడా.. బతికిపోతాడు. ఆ వచ్చినోడు పోలీసోడు కాదని వాళ్లు నమ్మాల. నమ్మితే తిండి పెట్టి దారి చూపిస్తరు. లేకపోతే ఈడ్చుకుపోతరు.
నేను; ఎక్కడికి?
శ్రీనివాస దురై: ఇంగెక్కడికి? వీరప్పన్ మనుషులు మురుగేశన్, సుబ్రమణి లాంటోళ్ల దగ్గరికి. ఆళ్లు కొట్టి, హింసించి అడుగుతరు. అప్పటికీ ఆడు నిజం చెప్పలేదో.. సరాసరి పులి నోట్లోకే..
(నేను బ్లాంక్ ఫేస్ పెట్టాను) వీరప్పన్ దగ్గరకబ్బా.. కళ్లకు గంతలు కట్టి ఎక్కడో అడవుల్లో 40-50కిలోమీటర్లు నడిపిస్తరు. కావాలనే నడిపిస్తరు. కొండచుట్టూ పది సార్లు తిప్పుతరు. అమ్మ.. ఇక వాడి పని ఐపోతుంది అనుకున్నప్పుడు, వీరప్పన్ ముందు నిలబెడతరు. ఈలోపు రెండు రోజులు గడుస్తయి.
నేను: ఎందుకలా.. కొండ చుట్టూ తిప్పటం? అనవసరంగా వాడిని తిప్పటంతో బాటు వీళ్లకి కూడా కాళ్లనొప్పులు కదా?
శ్రీనివాస దురై: మరదే.. ఆడి ఒంట్లో ఓపిక మొత్తం అయిపోవాల. నాలుక ఎండిపోవాల. పట్టపగలే చుక్కలు కనిపించాల. అప్పుడు కదా.. వాడు ఎక్కడికీ తప్పించుకునే ఆలోచన చేయకుండా గమ్మునుండేది? ఆ 50కిలోమీటర్లు పోయేలోగా వాళ్లు పట్టేసుకుంటారని అనుకుంటడు. పారిపోటానికి కూడా భయపడుతడు.
నేను: మరి వాళ్ల మనుషులమాటో?
శ్రీనివాస దురై: వాళ్లదేముండాదబ్బా.. వంతులేసుకుని తిప్పుతరు. నలుగురు పోయిన తర్వాత ఇంకో నలుగురు వస్తారు. వాడ్ని మళ్లీ చుట్టూ తిప్పుతరు.
నేను: అలా తిప్పటం వలన వాళ్లకేంటి లాభం?
శ్రీనివాస దురై: డబ్బులబ్బా.. నిండా దుడ్డు ఇచ్చేదున్నప్పుడు వేరే పని ఏం చేస్తారు?
నేను: మరి వీరప్పన్ ఏంచేస్తాడు తర్వాత?
శ్రీనివాస దురై: వెళ్లగానే తాగటానికి నీళ్లిస్తడు. మర్యాదగా అడుగుతడు. అప్పటివరకు వీరప్పన్ రాక్షసుడని విన్నోడికి అలా మంచిగా కనిపించేసరికి భయం పోతుంది. మనసులో ధైర్యం వస్తుంది. వీరప్పన్ అంటే ఇంతేనా అనిపిస్తుంది. అదిగో అక్కడే నోరు జారతడు. ఎక్కువ వాగేస్తడు.
నేను: అంటే, నిజం చెప్తాడా?
శ్రీనివాస దురై: అక్కడిదాకా వెళ్ళాక వాడు నిజం చెప్పినా అంతే.. చెప్పకపోయినా అంతే. చావే.
నేను: ఇప్పుడేగా మంచిగా ఉంటాడన్నావ్?
శ్రీనివాస దురై: అవునబ్బా.. చావబోయేటోడ్కి గుక్కెడు మంచినీళ్లు పోస్తే పుణ్యమొస్తదని వాళ్లమ్మ చెప్పినాదంటలే. ఏదైనా చెప్పేది వీరప్పన్ ముందుకెల్టానికి ముందే చెప్పాల. ఒప్పుకోవాల. అక్కడికెల్లాక ఒకటే.. చెప్పినదాని బట్టీ పద్ధతి బట్టీ చావు రకం ఉంటుంది.
నేను: రకాలేంటీ?
శ్రీనివాస దురై: ఎక్కువగా కాల్చి చంపుతరు. వాడు పొగరుగా మాట్లాడితే.. నరికి చంపుతరు. ఎక్కువ బాధ అనుభవించాలి కదా.. శవాన్ని పూడ్చిపెట్టటమో.. నదిలో విసిరేయటమో చేస్తారు.
నేను: ఇంత రాక్షసంగా ఉంటే మంచివాడంటావేం?
శ్రీనివాస దురై: అక్కడికే వస్తున్నానబ్బా.. వీరప్పన్ ఏనుగు దంతాలు, గంధం చెట్లను కొట్టించీ సంపాదించింది ఎవరికోసం? అసలు వీరప్పన్‌కి ఎంత డబ్బు వస్తదో, ఎట్ల వస్తదో తెలుసునా?
నేను: ఎలా?
శ్రీనివాస దురై: బ్రోకర్లబ్బా.. పావు వంతు వీరప్పన్‌కిస్తే ముప్పావు వంతు వాళ్లే తిన్నరు. వాళ్లే బాగు పడ్డరు. వచ్చిన దాన్ని అందరికీ పంచిపెట్టేటోడు. బలగమా.. ఎక్కువ. సంపాదన తక్కువ. తనకంటే కుటుంబం లేకపోయే.. చుట్టూ ఉన్నోనికి ఉంటుంది కదా.. వాడు ఇంట్లో ఇచ్చుకోవాలకదా? అందరూ ముత్తు(వీరప్పన్ భార్య)లా ఉండరు కదా..
నేను: అంటే.. వీరప్పన్ ఏమీ దాచుకోలేదా?
శ్రీనివాస దురై: ఏముందబ్బా దాచుకోటానికీ? పెళ్లామా.. రానియ్యదు. పిల్లకేమో తండ్రిని చూసిన గుర్తేలేదు.
నేను: మరి అన్ని నేరాలెందుకు చేశాడంటావ్?
శ్రీనివాస దురై: చూడబ్బా.. నిన్ను ఒక వేషంలో చూసినప్పుడు జనం భయపడ్డారనుకో.. నీకు ఇష్టమున్నా లేకపోయినా అదే వేషం వేస్తావ్. నిన్ను చూసి జనం భయపడేటప్పుడే నీ చుట్టూ కొంతమంది మూగుతరు. ఆ వేషం నువ్వు తీయకుండా కాపలా కాస్తరు. వీరప్పన్ కూడా అంతే. జనంలో అతనంటే భయం పోతుందనుకున్నప్పుడు ఒకడ్ని చంపేటోడు. చుట్టూ ఉన్నోళ్లు వీరప్పన్ పేరు చెప్పి చంపేటోళ్లు.
నేను: మరి కిడ్నాపులు..
శ్రీనివాస దురై: అవి కూడా జనంలో, పేపర్లలో ఉండేందుకే.
నేను: పేపరంటే గుర్తొచ్చింది. గోపాల్(నక్కీరన్ పత్రిక) ఎలా కలిశాడు?
శ్రీనివాస దురై: ఎట్లా ఏముండాదబ్బా? మీరెట్లా కలుస్తారు, నక్సలైట్లనీ? అట్లే.
నేను: మరింకేం తెలుసు వీరప్పన్ గురించి?
శ్రీనివాస దురై: వీరప్పన్‌కి అడవి, అందులో చెట్లు, జంతువులు అన్నీ పరిచయమే. ఏ మొక్క దేనికి పనికొస్తదో.. ఏదిక్కున పొతే ఏమొస్తదొ.. ఎంత దూరంలో వస్తదో అంతా తెలుసు.
నేను: అడవిలో అన్నేళ్లు ఉంటే ఎవరికైనా తెలుస్తుందిలే..
శ్రీనివాస దురై: అట్లనమాక. వీరప్పన్ కనక అలా స్మగ్లింగూ.. చంపటాలు చెయ్యకపోతే.. ఒక పెద్ద సైంటిస్టు అయ్యేవాడు. ఎవరికీ తెలియని కొన్ని మూలికలుండేవి తెలుసా? అవి కాచి టీ లాగా తాగితే ఎంత పెద్దనొప్పులైనా చిటికెలో పోతాయంటారు. అలాంటివే లేకపోతే అన్నాళ్లు ఆ ఆడవిలో ఎలా ఉండేవాడు?
నేను: నువ్వు చూశావా పెద్దాయనా?
శ్రీనివాస దురై: లేదు. కాకపోతే వీరప్పన్ ప్యాంటు జేబులో ఉంటాయంటారు. నేను చూసినప్పుడు మాత్రం జేబులు ఎత్తుగానే ఉన్నాయి మరి.
నేను: డబ్బులేమో?
శ్రీనివాస దురై: అమాయకుడిలా ఉన్నావే.. అడవిలో డబ్బులెందుకు?
నేను: అంతేలే.. మరి రాజ్‌కుమార్‌ని కిడ్నాప్ చేశాడుకదా.. ఎందుకు?
శ్రీనివాస దురై: ఎందుకేంటి? అప్పుడు తమిళనాడు, కర్ణాటకలో అతనిమీద ఒత్తిడి పెరిగింది. జనమా..పోలీసులకి భయపడుతున్నారు. తిండికి కూడా కష్టమవుతోంది. ఏం చేస్తాడు? సూపర్‌స్టార్‌ని కిడ్నాప్ చేశాడు. రాజ్‌కుమార్ అతని దగ్గరున్నప్పుడు పోలీసులు వెనక్కెళ్లారు. డబ్బు తీసుకుని చనిపోయిన తన మనుషుల ఇళ్లలో ఇచ్చాడు.
నేను: వీరప్పన్ డబ్బుని అడవిలో దాచిపెట్టాడంటారు కదా..
శ్రీనివాస దురై: అతని దగ్గర అంత డబ్బెక్కడిదబ్బా.. వచ్చేదే తక్కువ. వచ్చిన దాంట్లో కూడా.. పంచేదెక్కువ. ఐనా వీరప్పన్‌కి తెలుసబ్బా తననెప్పుడో కుక్కలా కాల్చిచంపేస్తారని. కాకపోతే తనతో పాటు పోలీసులను కూడా పైకి తీసుకెళ్లాలని అనుకునేవాడు.
నేను: మరైతే వీరప్పన్ ఎన్‌కౌంటర్ నిజమేనని నమ్ముతావా నువ్వు?
శ్రీనివాస దురై: మనదేశంలో జరిగిన అన్ని ఎన్‌కౌంటర్‌లలో ఎన్ని నిజమంటే నువ్వేం చెప్తావ్? నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఒప్పుకోవాల. అంతే.

(సశేషం)