1, డిసెంబర్ 2008, సోమవారం

కార్గిల్ వీరులకు చెప్పండి.

ఆ వీర స్వర్గంలో

మన కార్గిల్ వీరులు కనిపిస్తే

చెప్పండి, ఈ కుర్చీలలో

ఎవరు కూర్చున్నా ఒకటేనని,

దేశభద్రత గాల్లో దీపమేనని.


భూతల స్వర్గంకోసం

జరిగే దాయాదుల పోరులో

మరణించిన సైనికుల

శవపేఠికల సొమ్ముతినే

రాబందుల దేశమిదని.


అధికారం చాలు మాకు

బాధ్యతలక్కర లేదు,

కుర్చీలకై పాకులాటలో

క్షణం తీరిక లేదు,

ప్రజల రక్షణకేమీ చేయలేమని.


గుడ్డి నిఘా వ్యవస్ధకు తోడు

చట్టం కుంటిదయింది.

న్యాయం మూగబోయింది.

మీ శౌర్యం, మీ ప్రతాపం స్కూలు

పిల్లల పాఠాలుగ మిగిలాయని.


మరో జన్మంటూ మీకుంటే

మీ ఈ దేశానికే రావాలని..

సైనికులుగా కాదు, నిజాయితీ

క్రమశిక్షణతో దేశదిశను మార్చే

నాయకులుగా రమ్మని.